నట వారసత్వం తెలుగుతెరకు చిరపరిచితం. దాదాపుగా ఇప్పుడున్న హీరోలందరూ వారసత్వంతో తెరంగేట్రం చేసినవారే. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, జూ ఎన్ టీ ఆర్, రాం చరణ్, అల్లు అర్జున్, రానా .. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత అవుతుంది. ఇప్పుడు ఈ లిస్టులో మరోపేరు చేరబోతున్నట్టు టాక్. చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా ఇప్పుడు లేటెస్ట్ గా తెరపైకి రాబోతున్నాడని వినికిడి. అప్పట్లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన “నచ్చావులే” చిత్రంతో వరుణ్ పరిచయం కావలసింది, అయితే కథ నచ్చకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఓకే కానట్టు సమాచారం. ఇప్పుడు వరుణ్ ను గ్రాండ్ గా లాంచ్ చేయడానికి నాగేంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ బేనర్ లో పరిచయమైన హీరోలందరూ పెద్ద హీరోలయిపోవడంతో అదే బేనర్ ద్వారా వరుణ్ ను ఇంట్రడ్యూస్ చేయాలని డిసైడ్ అయ్యారట మెగాఫ్యామిలీ మెంబర్స్. తనకు తగ్గ మంచి కథలు వెతకడం కోసం నాగేంద్రబాబు తో సహా పవన్ కళ్యాణ్ కూడా బాధ్యతను తీసుకున్నాడని సమాచారం. అలాగే ఓ స్టార్ డైరెక్టర్ కు ఈ సినిమా తెరకెక్కించే బాధ్యతను అప్పగించాలని నిర్ణయించినట్టు కూడా తెలిసింది. అన్నీ అనుకున్న విధంగా జరిగిపోతే మెగాఫ్యామిలీ నుండి మరో హీరోగా వరుణ్ తేజ్ 2013లో గ్రాండ్ గా లాంఛ్ అయ్యే అవకాశాలున్నాయి.