పవన్ కోసం ట్రెండ్ మార్చిన త్రివిక్రమ్

పవన్, త్రివిక్రమ్, దేవిశ్రీ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ విషయంలో అనేక వార్తలు ‘సరదా’గా వినిపించాయి. తాజాగా మరో న్యూస్ కూడా హల్ చల్ చేస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తో పాటు  మరో బాధ్యతను కూడా చేపట్టనున్నాడు… అది కూడా పవన్ ఇష్టం మేరకేనట. సహజంగానే మాటల రచయిత అయిన త్రివిక్రమ్ పవన్ కోసం పాటలు రాయబోతున్నారు. త్రివిక్రమ్ కు పాటలు రాయడం కొత్తేమీ కాదు. రవితేజ హీరోగా వచ్చిన ‘ఒక రాజు ఒక రాణి ‘ సినిమాకు గానూ ఆరు పాటలను త్రివిక్రమే రాశాడు. స్వరాలవీణ అనే సాంగ్ మంచి ఆదరణ పొందింది కూడా. అయితే ఆ చిత్రం అంతగా విజయం సాధించలేకపోవడంతో పాటలు కూడా వినపడలేదు. స్టొరీ రైటర్ గా బిజీ అయిపోవడంతో ఈ ప్రయత్నాన్ని మానుకున్నాడు త్రివిక్రమ్. ఇప్పుడు  పవన్ ఇష్టం మేరకే తన చిత్రంలో పాటలు రాస్తున్నాడని సమాచారం. తన మాటలతో లాజిక్ లు పంచే త్రివిక్రమ్ తన పాటలతో మ్యాజిక్కులు కూడా చేసెయ్యాలని ఆశిస్తుంది తెలుగు మిర్చి.