పవన్ కెరీర్ లో ఓ మైలు రాయి ‘ఖుషి’ చిత్రం. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో వచ్చిన ‘ఖుషి’ లో పవన్ మేనరిజం, స్టైల్, దర్శకుడు కధ మలచిన విదానం… ఇవన్నీ పవన్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఖుషి సినిమాలో దర్శకుడు ఎస్ జే సూర్య కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించాడన్న సంగతి గుర్తుండే ఉంటుంది. కధకు ఏ మాత్రం సంబంధం లేకున్నా ఆ పాత్ర సినిమాకు ఓ ట్విస్ట్ ఇచ్చేలా ఉంటుంది. ఇప్పుడు అలాంటి పాత్రనే పవన్ కొత్త సినిమా లో దర్శకుడు త్రివిక్రమ్ పోషించబోతున్నాడట. పవన్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న కొత్త సినిమాలో ఇలాంటి కీలక పాత్ర ఒకటి త్రివిక్రమ్ డిజైన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ పాత్రను త్రివిక్రమే చేయాల్సిందిగా తన భావాన్ని పవన్ తెలియజేసాడట. అందుకు త్రివిక్రమ్ కూడా సుముఖంగా ఉన్నాడని సమాచారం. అయితే సినిమా విడుదల వరకు ఈ విషయాన్ని గోప్యంగా వుంచాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. జల్సా వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత రిపీట్ అవుతున్న ఈ పవన్-త్రివిక్రం కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.