Site icon TeluguMirchi.com

“బాబూ ….మీ స్థాయికి ఇది తగదు”

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి సతీమణి, సాక్షి గ్రూప్ చైర్మన్ వై.ఎస్.భారతి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు కు బహిరంగ లేఖ వ్రాసారు. తన పాదయాత్రలో చంద్రబాబు జగన్ పై చేస్తున్న విమర్శల నేపధ్యంలో భారతి ఈ లేఖ వ్రాసారు. లేఖ సారాంశం లోకి వెళితే ” చంద్రబాబు గారూ.. ఇటీవల కాలంలో సభలలో మీ ప్రసంగాలు, విమర్శలు వింటుంటే మీరు విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని వెల్లడవుతోంది. కాంగ్రెస్ పార్టీ తో చేతులు కలిపి, మీ పార్లమెంటు సభ్యులను కేంద్రమంత్రి చిదంబరం వద్దకు పంపి నా భర్తకు బెయిల్ రాకుండా చేసారు. నా భర్తను జైలులో వుంచి ఆయన మీద అన్నిరకాల దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారు… ఒక మనిషి ఎదురుగా లేనప్పుడు అతని గురించి తప్పుడు ప్రచారం చేయటం సంస్కారం కాదని మీకు తెలియదా? ఎంతో మంది ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన మీరు ఇలా విలువలు లేని రాజకీయాలకు పాల్పడటం మీ స్థాయికి, వయసుకు తగిన పనేనా ? మాజీ ముఖ్యమంత్రిగా, ఒకప్పుడు దేశ రాజకీయాలను సైతం నిర్దేశించిన వ్యక్తిగా , రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా హుందా మరచి మీరిలా మాట్లాడటం హుందాగా లేదని చెప్పటానికి సిగ్గుపడుతున్నాను. నాలాంటి ఆడపడుచుల కన్నీరు మీకు మంచిది కాదు…. నా భర్త స్థాపించిన భారతి సిమెంట్స్ , జగతి పబ్లికేషన్స్ సంస్థలు ఈ రోజు దేశంలోనే అగ్రగామిగా నిలిచాయి. ఈ సంస్థల మీద షుమారు ముప్ఫై వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. వారి నోటి దగ్గర కూడు తీయకండి. విలువలు గల రాజకీయాల కోసం నా భర్త లానే మీరు కూడా నిలబడాలని మనసారా ఆశిస్తున్నాను.. ఇట్లు .. వై.ఎస్.భారతి “

Exit mobile version