Site icon TeluguMirchi.com

సునీల్ తో రగడ చేయనున్న వీరు పోట్ల

రాజమౌళి “మర్యాదరామన్న”తో హీరోగా మారిపోయిన హాస్యనటుడు సునీల్‌ తన కెరియర్‌ ప్లానింగ్‌ బాగానే చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. వర్మ దర్శకత్వంలో హీరోగా చేసిన “కథ స్క్రీన్‌ ప్లే దర్శకత్వం అప్పల్రాజు” నిరాశపర్చినా తరువాత వచ్చిన “పూలరంగడు” మాత్రం తనకు పూలబాటనే పరిచిందని చెప్పుకోవాలి. ఇప్పుడు బాలీవుడ్‌ లో హిట్‌ గా నిలిచిన “తను వెడ్స్‌ మను”కు రీమేక్‌ గా వస్తున్న “మిస్టర్‌ పెళ్ళికొడుకు” చిత్రంతో బిజీగా ఉన్న సునీల్‌, దీనితో పాటు నాగచైతన్యతో కలిసి తమిళ”వేట్టై” రీమేక్‌ లోనూ నటిస్తున్నాడు. ఇందులో కూడా సునీల్‌ ది హీరో పాత్రే. ఇప్పుడు తాజాగా సునీల్‌ హీరోగా మరో సినిమా కు పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. నాగార్జునతో “రగడ” సినిమా చేసిన దర్శకుడు వీరుపోట్లతో ఓ చిత్రం చేయడానికి అంగీకరిచాడట. “రగడ” ఘోరంగా దెబ్బతిన్నాక తనని పెద్ద హీరోలెవరూ పట్టించుకోకపోవడంతో వీరు సునీల్‌ కోసం ఓ కథ తయారు చేసుకుని వినిపించాడట. కథ విన్న సునీల్‌ అది తనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేసాడని, ఆ సినిమాను నిర్మించడానికి ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ కూడా సిద్ధమయ్యాడని తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Exit mobile version