వినాయక్ “నాయక్”, హిందీ చిత్రం “జంజీర్” షూటింగ్ లతో బిజీగా ఉన్న రాంచరణ్ అపోలోలో ఏం చేస్తున్నాడు? అంటే సమాధానం తన డ్యూటీ చేస్తున్నాడనేదే! తన హిందీ చిత్రం “జంజీర్” సినిమా షూటింగ్ అపోలోలో జరుగుతోంది. సినిమా కథలో భాగంగా ప్రియాంకా చోప్రా, చరణ్ లు హాస్పిటల్ కి వచ్చే సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న అపోలో లో జరుగుతూ ఉంది. దర్శకుడు యోగి జంజీర్ తెలుగు వెర్షన్ కి సంబంధించిన పర్యవేక్షణ భాద్యతలు చూసుకుంటున్నాడు. షూటింగ్ కోసమని హాస్పిటల్లోని కొంతభాగాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు సమాచారం. అయితే దీనివల్ల రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. సాధారణంగా అపోలోలో సినిమా షూటింగులకు అనుమతి ఉండదు. అయితే రాం చరణ్ భార్య ఉపాసన అపోలో గ్రూప్స్ చైర్మెన్ ప్రతాపరెడ్డికి మనమరాలు కావడం వల్ల ప్రత్యేక పరిస్థితుల్లో పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జంజీర్ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 22 రోజులపాటు జరుగుతున్నట్టు తెలిసింది.