రైతు సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు (బుధవారం) ఉదయం రైతు సమస్యలపై గన్ పార్క్ వద్ద తెదేపా చేపట్టిన ధర్నా కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు రుణాలు అందటం లేదని బాబు అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 23వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన తెలిపారు. ప్రతి రైతుకూ.. వ్యవసాయం లాభిసాటిగా మారే వరకు పోరాటం చేస్తామని బాబు స్పష్టం చేశారు.