మళ్లీ ఢిల్లీ టూర్..?

T-ministers“ఛలో అసెంబ్లీ” తో మరోసారి తెలంగాణ ఉద్యమం రాజుకుంది. తెలంగాణ నేతలు మళ్లీ సమావేశాల మీద సమావేశాలు నిర్వహించి తెలంగాణపై తమకు గల ఉడత భక్తిని చాటుకుంటున్నారు. తాజాగా సచివాలయంలోని మంత్రి జానారెడ్డి ఛాంబర్‌లో తెలంగాణ మంత్రులు, ఎంపిల సమావేశమయ్యారు. ఈనెల 18న తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశం కావాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనంతరం తెలంగాణ ప్రాంత ఆకాంక్షను అధిష్టానానికి వివరించి తెలంగాణను సాధించుకునే దిశగా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు మరోసారి ఢిల్లీ టూర్ చేపట్టాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.

జానారెడ్డితో సమావేశమైనవారిలో ఎంపిలు పొన్నం ప్రభాకర్, పాల్వయి గోవర్థన్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, రాపోలు ఆనంద్ భాస్కర్, పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి, బస్వరాజు సారయ్య  తదితరులు ఉన్నారు.