“సీతమ్మ వాకిట్లో..” పాటల పండగ లేదా..? !

సినిమా ముహూర్తం నుండి నిర్మాతలు తమ సినిమాలను ప్రమోట్‌ చేసుకోవడానికి సందర్భాలు వెతుక్కుంటూ ఉంటారు. ఒకవేళ ఏదీ లేకపోయినా తమంతట తామే సృష్టించుకోవడం కూడా షరామామూలే! సినిమా ప్రారంభోత్సవం, ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి, సెకండ్‌ షెడ్యూల్‌ పూర్తి, పాటల చిత్రీకరణ ప్రారంభం, ముగింపు, టాకీ పూర్తి, డబ్బింగ్‌ స్టార్ట్‌, క్లోజింగ్‌… ఇలా ఏవేవో పేర్లు పెట్టి ప్రెస్‌ మీట్ల నుండి గ్రాండ్‌ ఫంక్షన్‌ లు చేయడం వరకూ ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆడియో రిలీజ్‌ మరో ఎత్తు. భారీ లెవెల్లో జరుపుకుంటారు. అందునా ఆ సినిమా పెద్ద హీరోలదయితే చెప్పనవసరం లేదు. భూదేవంత అరుగు, ఆకాశమంత పందిరి, తారాతారణం అన్న రేంజ్‌ లో నిర్వహించడం ఆనవాయితీ.. కానీ ఈ మధ్య ఎందుకనో కొందరు మన హీరోలు, నిర్మాతలు ఈ వేడుకలను నిర్వహించకుండా సైలెంట్‌ గా పాటలను మార్కెట్‌ లోకి విడుదల చేసేస్తున్నారు. పవన్‌-పూరీల “కెమెరామెన్‌ గంగతో రాంబాబు”, రవితేజ “సారొచ్చారు” ఇలా గప్‌ చుప్‌ గా పాటల విడుదల గావించుకున్నవే… ఇప్పుడు తాజాగా దిల్‌ రాజు నిర్మాతగా విక్టరీ వెంకటేశ్‌, మహేశ్‌ బాబులు హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్‌ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” కూడా ఆడియో రిలీజ్‌ వేడుక నిర్వహించకుండా పాటలను డైరెక్ట్‌ గా మార్కెట్లోకి వదలాలని అనుకుంటున్నట్టు ఓ సమాచారం. ఈ నెల 16 న ఆడియో వేడుకను గ్రాండ్ లెవెల్లో చేయనున్నట్టు ఇంతకు ముందు నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. అయితే, అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా చేయాలనుకున్న ఈ వేడుకను కేన్సిల్ చేసి, ఆ రోజు సింపుల్ గా ఆడియోను మార్కెట్టుకి విడుదల చేయాలని నిర్మాత తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానిజాలు తెలియాలంటే సినిమాకు సంబంధించిన వారి నుండి అధికారికంగా వార్త రావలసి ఉంటుంది. ఒకవేళ ఇది నిజమయితే మాత్రం వెంకీ, మహేశ్‌ ల అభిమానులకు తప్పనిసరిగా ఓ పెద్ద నిరాశే అని చెప్పక తప్పదు.