కార్యకర్తలదే ఈ ఘనత

rajnath-modiగుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రచార సారథ్యం అప్పగించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సింగ్ మాట్లాడారు. గోవాలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశం ముగింపు ప్రసంగం చేస్తూ.. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే మోడీని ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించామని వెల్లడించారు. కాంగ్రెస్ పాలన పుణ్యమా అని మాల్దీవుల వంటి చిరు దేశాలు సైతం పొగరుగా తలెగరేస్తున్నాయని, మాట వినకుండా మొండికేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. యూపీఏ తొమ్మిదేళ్ళ పాలనలో సామాన్యుడి జీవితం కుంటుపడిందని, ధరలు మాత్రం ఆకాశానికి ఎగిశాయని ఎద్దేవా చేశారు. ఇక తాము వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఏకిపారేయడంతో పాటు భవిష్యత్ పై స్పష్టమైన అజెండాతో ముందుకుసాగుతామని రాజ్ నాథ్ వివరించారు.

ఇక బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితుడైన నరేంద్ర మోడీ మాట్లాడుతూ … తనను ఈస్థాయిలో తీర్చిదిద్దిన ఘనత కార్యకర్తలదే అని వ్యాఖ్యానించారు. కార్యకర్తలే భవిష్యత్తు నిర్ధేశకులని అన్నారు. బీజేపీ కార్యకర్తలపై తనకు పూర్తి నమ్మకముందని నొక్కి చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కలలను నిజం చేయాలని కార్యవర్గానికి పిలుపునిచ్చారు. ఇక ప్రచార కమిటీ చైర్మన్ గా నూతన బాధ్యతలప్పగించిన రాజ్ నాథ్ కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.