తెలంగాణ అంశంపై అధిష్టానానికి డెడ్లైన్ పెట్టే సాహసం చేయవద్దని, కాంగ్రెస్ పార్టీ ఎవరి డెడ్లైన్లకు లొంగదు ఘాటు వ్యాఖ్యలు చేసిన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఉదయం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ముఖ్యమంత్రికి విశ్వసనీయత లేదన్నారు. తెలంగాణవాదుల మనోభావాలు కించపరిచేలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ ఇవ్వదని స్పష్టమైందన్నారు. డూప్లికేట్ గాంధీల నాయకత్వంలో కాంగ్రెస్ పాలన సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ అంశంపై ఇచ్చిన నెలరోజుల గడువు ఎటుపోయిందని ఈ సందర్భంగా కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.