కోదండరాం కు అత్యంత సన్నిహితులుగా మెలుగుతున్న కొందరు నాయకులను కూడా కే.సి.ఆర్. తన దగ్గరకు పిలిపించుకుని తన వైపు తిప్పుకున్నట్టు జే.ఎ.సి. వర్గాల కథనం. ఈ విధంగా కోదండరాం కు తెలియకుండా ఆయన చాప కిందికి నీరు తేవటంలో కే.సి.ఆర్. సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇది చాలదన్నట్టు ఇటివల రాష్ట్రమంత్రి గీతారెడ్డి కి వ్యతిరేకంగా కోదండరాం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయనపై ఎస్సి. ఎస్టి . అట్రాసిటి కేసు నమోదయింది. రాష్ట్ర వ్యాప్తంగా గీతా రెడ్డి కి చెందిన సామాజిక వర్గం రెచ్చిపోయింది. మంత్రి కూడా ఆగ్రహంతో ఊగిపోయింది. అమీ తుమీ తేల్చుకోవాలనుకుంది. ఈ పరిణామం తో కంగారుపడిన కోదండరాం తానసలు ఆ వ్యాఖ్యలు చేయలేదని బుకాయించి ఆ తరువాత ” తప్పు చేసాను…క్షమించండి…ఇంకెప్పుడూ ఇలా జరగదు…ఈ సారికి వదిలేయండి…” అని ప్రాధేయపడే స్థితికి చేరుకున్నారు. ఈ దశలో కోదండరాం కు నైతికంగా ఇటు జే.ఎ.సి. నుంచి గానీ , తెరాస నుంచి గానీ ఎటువంటి మద్దతు లభించలేదు… ఇదే సమయంలో తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణా ఉద్యోగ సంఘాల నాయకుడు స్వామిగౌడ్ తెరాస తీర్ధం పుచ్చుకుని కే.సి.ఆర్. కు జై కొట్టారు. దీంతో కోదండరాం ను మరింత ఒంటరితనం ఆవహించింది. శుక్రవారం నాడు కె.సి.ఆర్. ను కలువనున్న కోదండరాం కు ఎటువంటి స్వాగతం లభిస్తుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. క్రమేపి అందరూ దూరమవుతుండటంతో ఒంటరిగా మిగిలిపోయిన కోదండరాం తన ఉద్యమ భవితవ్యాన్ని, రాజకీయ భవితవ్యాన్ని ఎలా పునర్నిర్మించుకుంటారో చూడాల్సిందే…