Site icon TeluguMirchi.com

కె సి ఆర్ చెప్పేవి పిట్టకధలు….. చంద్రబాబు

“తెరాస అధినేత ఆరునెలలు ఫాం హౌస్ లో పడుకుంటారు.. ఆరు నెలలు లేస్తారు… లేచి అందరికి ఉద్యోగాలు ఇస్తామంటూ, సాగునీరు ఇస్తామంటూ మాటల గారడీ చేస్తారు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి తన కుటుంబ సభ్యులకు మాత్రం పదవులు సంపాదించుకుంటారు. ఆయనది పూటకో మాట…. రోజుకో బాట ” అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కే.సి.ఆర్. పిట్టకధలు చెబుతారు తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఏదీ చేయరని, కేంద్రకార్మిక మంత్రిగా వుండగా బీడీ కార్మికులకు అన్యాయం చేసిన ఘనత ఆయనదేనని చంద్రబాబు దుయ్యబట్టారు. ” తెలుగుదేశాన్ని దెబ్బ తీయటమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యం…అలాంటి కాంగ్రెస్ లో విలీనం అయేందుకు టి.ఆర్.ఎస్. సిద్ధంగా వుంది… టిడిపి అడిగినంతమాత్రాన కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వదు.” అని చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం నాడు నారాయణ ఖేడ్ నుంచి ప్రారంభమైన బాబు ” వస్తున్నా …మీకోసం ” యాత్రలో భాగంగా పలుచోట్ల జరిగిన సభల్లో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజల సొమ్మును దోచేసిందని, రెండుసార్లు వరుసగా అధికారాన్ని కట్టబెట్టినా ఆ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. అవినీతి మంత్రులకు మద్దతిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి సిగ్గులేదని , ధర్మాన పై  మంత్రివర్గం పంపిన ఫైలును గవర్నర్ తిరస్కరించాలని బాబు డిమాండ్ చేసారు.

Exit mobile version