Site icon TeluguMirchi.com

” అల్లుడికి బయ్యారం….కొడుక్కి ఓబులాపురం “

తెలంగాణా ప్రజలకు రాజన్న రాజ్యం , చంద్రన్న రాజ్యం వద్దనీ, తెలంగాణా రాజ్యం కావాలనీ తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే.చంద్రశేఖర రావు ఆదివారం నాడు సూర్యాపేట లో జరిగిన సమరభేరి కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వ భూములు, ఆస్తులు, వనరులు కొల్లగొట్టారని , వైఎస్ పోతిరెడ్డిపాడు నుంచి తెలంగాణా నీళ్లను ఎత్తుకెళ్ళిన దొంగ అనీ, తన అల్లుడికి బయ్యారం గనులూ, తన కొడుకు జగన్ కు ఓబులాపురం గనులూ ఇచ్చారని కే.సి.ఆర్ విమర్శించారు. చంద్రన్న రాజ్యం తొమ్మిదేళ్ళు చూసామని, చంద్రబాబు పాదయాత్ర కాదుగదా మోకాళ్ళ యాత్ర చేసినా తెలంగాణా ప్రజలు ఆయనను నమ్మబోరని ఆయన అన్నారు. జగన్ ను ఎవరూ జైలుకు పంపలేదని, కోర్టులే పంపాయని, కోర్టులు కుట్ర పన్నాయనేందుకు విజయమ్మ సాహసించగలరా అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 9 వ తేదిన వచ్చిన తెలంగాణాను చంద్రబాబు అడ్డుకున్నారని కే.సి.ఆర్ ఆరోపించారు. జలయజ్ఞాన్ని వైఎస్సార్ ధనయజ్ఞంగా మార్చారని, ఆయన హయాంలో మొదలెట్టిన ప్రాజెక్టులన్నీ సీమాంద్ర ప్రాంతానికి ప్రయోజనకరమైనవే నని, తెలంగాణా ప్రాజెక్టులు ఏమీ లేవని కే.సి.ఆర్ ధ్వజమెత్తారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నిప్రాంతాలను సమానంగా చూసారంటున్న విజయమ్మ…. తిరుపతిలో రిమ్స్ పూర్తయినా, బీబీనగర్ లో నిమ్స్ ఎందుకు పూర్తి కాలేదో సమాధానం చెప్పగలరా అని కే.సి.ఆర్ ప్రశ్నించారు. రాజన్న రాజ్యంలో జగన్ దందాల వల్ల అధికారులు, మంత్రులు జైళ్లకు వెళ్ళే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే 24 జిల్లాలు ఏర్పడతాయని, సూర్యాపేట కూడా జిల్లాగా అవతరిస్తుందని ఆయన తెలిపారు. సీమాంధ్ర నాయకుల అధ్వర్యంలో వున్న రాజకీయ పార్టీ లను తెలంగాణా నుంచి తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభలో జే.ఎ.సి.చైర్మన్ కోదండరాం, పలువురు ఎం.ఎల్.ఎ.లు పాల్గొన్నారు.

Exit mobile version