జగమే మాయ బతుకే మయ… ఈ పాట గుర్తుకు రాగానే మన స్మృతిపథంలో అక్కినేని రూపం, చేతిలో మంది గ్లాసు ఇవే ప్రత్యక్షం అవుతాయి. దేవదాసు పాత్ర ఇప్పటికీ మన మధ్య సజీవంగా ఉంది అని చెప్పడానికి అంతకంటే రుజువులు ఏంకావాలి? అక్కినేని నాగేశ్వరరావు అసమాన నటన, పారుగా సావిత్రి చేసిన అభినయం, వేదాంతం దర్శకత్వ ప్రతిభ, అబ్బుర పరిచే సంగీతం – ఇవన్నీ ఈ సినిమాని క్లాసిక్ గా నిలిపి ఉంచాయి. సరిగ్గా అరవై ఏళ్ల క్రితం అంటే… 1953 జూన్ 26న ఈ సినిమా విడుదలై ప్రభంజనం సృష్టించింది. శరత్బాబు రాసిన దేవదాసు నవలకు సజీవరూపం తీసుకొచ్చింది.
కేవలం ఆరు లక్షల వ్యయంతో పూర్తయిన సినిమా ఇది. నాగేశ్వరరావు పారితోషికం ఎంతో తెలుసా?? రూ.10 వేలు. ఈ సినిమాలో అక్కినేని నటన చూస్తే – నిజంగా తాగి సెట్కి వచ్చారేమో అనే అనుమానం వేస్తుంది. అసలు నిజం ఏమిటంటే…. నాగేశ్వరరావు ఫుల్లుగా భోజనం చేసి, సెట్కి వచ్చేవారట. షూటింగ్లన్నీ రాత్రి సమయంలోనే జరిగేవి. అందుకే నిద్ర ముంచుకొచ్చేసేదట. ఆ మత్తులోనే కెమెరా ముందుకు వచ్చేవారు. అందుకే తాగిన మత్తు… కోసం ప్రత్యేకంగా నటించే అవసరం రాలేదట. 60 ఏళ్లు కాదు, మరో అరవై ఏళ్లు వచ్చినా దేవదాసు గురించి ఇలా చెప్పుకొంటూనే ఉంటాం. అదీ ఈ సినిమాలో ఉన్న గొప్పదనం.