ప్రముఖ కథానాయకుడు, బసవతారకం ‘ఇండో-అమెరికన్’ క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ యువ రత్న నందమూరి బాలకృష్ణను ‘జీవిత సాఫల్య పురస్కారం’ వరించింది. అమెరికాలోని ‘డెలావేర్ తెలుగు సంఘం’ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. బాలకృష్ణను డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం 40వ వార్షికోత్సవాల్లో జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నట్టు అధ్యక్షుడు పొట్లూరి రవి తెలిపారు. ఈ వార్షికోత్సవాల్లో భాగంగా సాహిత్యం, కళలు, సామాజిక సేవారంగాల్లో విశిష్ట సేవలను అందించిన పలువురిని సన్మానించనున్నారు. ఈనెల 28, 29 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమంలో నయనతార కూడా పాల్గొని ప్రవాసాంధ్రులను అలరించనుంది. అలాగే, మణిశర్మ సంగీత సారథ్యంలో సునీత, ఉష కారుణ్య, హేమచంద్ర, శ్రావణ భార్గవి, అంజనా సౌమ్య తదితరులతో మ్యూజికల్ షో కూడా నిర్వహిస్తున్నారు.