మొన్నటికి మొన్న టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన నాగార్జున నటించిన భారీ బడ్జెట్ చిత్రం “ఢమరుకం” ఫైనాన్స్ చిక్కుల్లో పడి రిలీజ్ కోసం వాయిదాల మీద వాయిదా తేదీలను ప్రకటించి అభాసుపాలైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఎలాగైతేనేం ఎట్టకేలకు పలువురు సినీప్రముఖుల సహాయ సహకారాలతో ఆ చిత్రం చిక్కుల నుండి బయటపడి రిలీజయిపోయింది “ఢమరుకం”. ఇప్పుడు తాజాగా మరో తెలుగు సినిమా ఇలాంటి చిక్కులనే ఎదుర్కుంటోంది. నవదీప్, సదా జంటగా నటించిన “మైత్రి” సినిమా ఈ నెల 30న విడుదల కావలసి ఉంది. అయితే సదరు సినిమా నిర్మాతపై మూర్తి అనే ఫైనాన్షియర్ సిటీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తనకు నిర్మాత ఇవ్వవలసిన డబ్బు చెల్లించలేదని పిటీషన్ లో పేర్కొన్నారు. మరి “మైత్రి” సినిమా ఈ చిక్కుముళ్ళ నుండి బయటపడి విడుదలకు నోచుకుంటుందా? లేదా అన్నది ప్రస్థుతానికయితే అనుమానమేనని సమాచారం.