అక్కినేని సుశాంత్, శాన్వి జంటగా నటించిన చిత్రం అడ్డా. జి.ఎస్.కార్తీక్ దర్శకుడు. ఏ.నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాల్ని ఆదివారం రాత్రి… హైదరాబాద్లో విడుదలయ్యాయి. తొలి సీడీని నాగేశ్వరరావు విడుదల చేశారు. నాగార్జున అందుకొన్నారు. ఈ వేదికపై సుశాంత్, శ్వేతాభరద్వాజ్, శాన్వి స్టెప్పులు వేసి ఆహుతులను అలరించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ”ఈ సినిమా కోసం సుశాంత్ రెండేళ్లుగా కష్టపడ్డాడు.. అని అందరూ గొప్పగా చెబుతున్నారు. అది హాస్యాస్పదంగా అనిపిస్తోంది. ఎందుకంటే విజయం కావాలంటే, కష్టపడాల్సిందే. ఈ సినిమాలో పాటలు బాగున్నాయి. యువతరాన్ని ఉర్రూతలూగించేలా ఉన్నాయ”న్నారు.
నాగార్జున చెబుతూ ”గ్రీకువీరుడు, తడాఖా, అడ్డా ఇలా… వరుసగా సినిమాలొస్తున్నాయి. వచ్చే యేడాది అఖిల్ సినిమా కూడా ఉంటుంది. మాస్ పాటల వేడుకలో నేను కూడా డాన్స్ చేశా. ఆ సినిమా ఎంత హిట్టయ్యిందో, ఈ సినిమా కూడా అంతే హిట్టవ్వాలి” అని ఆకాంక్షించారు. సుశాంత్ మాట్లాడుతూ ”సినిమాలు మానేశావా? అని అందరూ అడిగారు. అభిమానులు మాత్రం మీ సినిమా ఎప్పుడు? అని అడిగారు. వాళ్లిచ్చిన స్ఫూర్తితోనే ఈ సినిమా చేశా. ఏవరేజ్ సినిమాకాదు.. హిట్టుకొట్టాలనే ఉద్దేశ్యంతో కసిగా చేసిన సినిమా ఇది”అన్నారు.