మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన కుటుంబసభ్యులు ఈరోజు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ 70వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన కుమారుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి రెడ్డి, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్త పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అదేవిధంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నాయి. అలాగే రైతు బాంధవుడు, వైఎస్సార్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.