హైదరాబాద్ ను తెలంగాణకు ఎలా ఇస్తారు..?

YS-Vijayamma-FrontpageIndia1హైదరాబాద్ ను తెలంగాణలో కలపటం ఏ విధంగా సబబో కేంద్రం చెప్పాలని వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్రులు వెళ్లిపోవాలని కేసీఆర్ ఎలా అంటారని ఆమె ప్రశ్నించారు. సమన్యాయం చేయలేని కాంగ్రెస్ పార్టీ విభజన బాధ్యత ఎలా తీసుకుందని ఆమె అన్నారు. విభజన విషయంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా కేంద్రం ఓ తండ్రిలాగా వ్యవహరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని విజయమ్మ అన్నారు. జగన్ కోసమే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని ఆమె ఆరోపించారు. విభజనపై కాంగ్రెస్ నేతలు ఒక్కక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారని విజయమ్మ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారని, విభజన చేసినా.. చేయకపోయినా అన్ని ప్రాంతాల్లో వైఎస్ అభిమానులు ఉన్నారన్నారు.అన్నిచోట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని విజయమ్మ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా హైదరాబాద్ విషయంలో ఇంత డైరెక్టుగా మాట్లాడలేదు. అయితే, ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీ ఖాళీ అవుతున్న నేపథ్యంలో.. ఇక సీమాంధ్ర ప్రాంతం వారి మన్నలను పొందడానికే హైదరాబాద్ పై నేరుగా ఇలాంటి వ్యాఖ్యలు చేసి వుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.