‘వస్తున్నా.. మీకోసం’@2500 కి.మీ.

NCBN1తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన “వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాల్లో కొనసాగుతుంది. దాదాపుగా ఆరు నెలల నుండి పాదయాత్ర చేస్తున్న బాబు తన ప్రయాణంలో మరో మైలురాయి దాటారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట దగ్గర చంద్రబాబు పాదయాత్ర 2500 కిలోమీటర్లు దాటింది. ఈ సందర్భంగా భారీ పైలాన్ ను బాబు ఆవిష్కరించారు. అలాగే 2500 కొవ్వొత్తులతో పార్టీ కార్యకర్తలు నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. అభిమానులు, పార్టీ కార్యకర్తల మధ్య చంద్రబాబు ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. గతంలో పార్టీని వీడిన వారంతా తిరిగిరావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులంతా సమిష్టిగా కృషి చేసి ఆయా నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించాలని కర్తవ్యబోధ చేశారు.

పార్టీ అధికారంలోకి రాగానే.. తాను కార్యకర్తలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్నీ విధాల ఆదుకుంటానని బాబు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎవరికి పడితే వారికి టిక్కెట్టు ఇచ్చేది లేదని, అభ్యర్థుల చరిత్ర చూస్తామన్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తున్నవారిని గుర్తిస్తామన్నారు. అభ్యర్థుల గత చరిత్రను పూర్తిగా పరిశీలించిన తర్వాతే టిక్కెట్ ఇస్తామని బాబు స్పష్టం చేశారు.