సీఎం జగన్ తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ…!

సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్. కానీ ఇది రాజకీయ భేటీ కాదండోయ్… కేవలం తన నియోజకవర్గంలో నీటి సమస్య పై సీఎం ని కలిశారు. ఇంతకు ముందే పోలవరం కుడి కాలువ నుంచి నీటి మళ్లింపునకు విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ వంశీ ఇప్పటికే జగన్‌కు లేఖ రాశారు. ఇక ఈ రోజు అసెంబ్లీలో సీఎం చాంబర్ లో జగన్ తో సమావేశమైన వంశీ గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట గ్రామాలకు పోలవరం కుడికాల్వ నుంచి గోదావరి జలాల్ని తరలించేందుకు సహకరించాలని కోరారు.

ఇప్పటికే తన సొంత ఖర్చుతో 500 మోటార్లు ఏర్పాటు చేసి గత నాలుగేళ్లుగా నీళ్లు అందిస్తున్నానని, దీనికోసం ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ను అందిస్తూ వచ్చిందని వెల్లడించారు. ఏపీఎస్పీడీసీఎల్ అధికారులకు ఆదేశాలిచ్చి గతంలో మాదిరిగానే విద్యుత్ సరఫరా ఇచ్చేలా చూడాలని వంశీ విజ్ఞప్తి చేశారు. దీనిపై జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సైతం సీఎం ప్రత్యేక నిధి నుంచి అభివృద్ది పనులకు కోటీ రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.