ఏపీ ఎన్జీవోల సభకు అనుమతిపై తెలంగాణ నేతల గుర్రు

K-Keshava-Raoఈ నెల 7న ఏపీ ఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన సభకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వడాన్ని తెలంగాణ నేతలు మండిపడ్డారు. దీని వెనక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కుట్ర వుందని తెరాస నేత కే. కేశవరావు ఆరోపించారు. ఈ నెల 10వరకు నగరంలో ఎటువంటి ర్యాలీలకు గానీ, సభలకు అనుమతి లేదంటూ విధించిన ఆంక్షలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. సీఎం కుట్రలోని భాగమే ’సేవ్ ఆంధ్రపదేశ్’ సభకు అనుమతిని ఇవ్వడమని కేకే ఆరోపించారు. ఇక ఏపీ ఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ మహ సభకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయకపోతే హైదరాబాద్ రణరంగమవుతుందని.. కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణవాదుల సభకు అనుమతివ్వని సీఎం ఎన్జీవోల సభకు ఎలా అనుమతిస్తారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. మరోవైపు, ఏపీ ఎన్జీవోల సభకు అనుమతిని ఇవ్వడాన్ని టీ-ఎన్జీవోలు ఖండించారు. మేము సభాసమావేశాలు చేసుకుంటామంటే.. ఉత్కంఠంగా చివరి నిమిషంలో అనుమతిని మంజూరు చేసే ప్రభుత్వం ఏపీ-ఏన్జీవోలకు పిలిచి మరి అనుమతిని ఎలా ఇస్తారని ప్రశ్నించారు.