కేటీఆర్.. తెలంగాణ కోహ్లీ !

మంత్రి కేటీఆర్ తెలంగాణకు కోహ్లీ లాంటోడని భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నారు. శనివారం వరంగల్ నిట్‌ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్‌తో పాటు మాజీ క్రికెటర్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. “దేశంలో అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ దూసుకుపోతూ నంబర్‌ వన్‌గా ఉంది. ఆయన కేటీఆర్’ని విరాట్ కోహ్లీతో, మంత్రి కడియం శ్రీహరిని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రితో పోల్చారు”.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. “1987లో హైదరాబాద్‌లో జరిగిన పాక్‌– ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ ఓపెనర్‌గా బ్యాటింగ్‌ చేస్తుంటే… పాక్‌ బౌలర్‌ వసీం అక్రమ్‌ వేసిన బంతి ఆయన కంటికి తగిలి రక్తస్రావం అయింది. డ్రెస్సింగ్‌ రూమ్‌లో గాయానికి నాలుగు కుట్లు వేయించుకుని తిరిగి క్రీజ్‌లోకి శ్రీకాంత్‌ వచ్చి బాగా ఆడారని గుర్తు చేశారు. సమస్యలను ఎదుర్కొనే మానసిక స్థైర్యం విద్యార్థులకు, యువతకు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ విషయం చెబుతున్నానన్నారు”.