ఈ సమావేశంలో ఆర్థికమంత్రి చిదంబరం, ఇతర కేంద్ర మంత్రులు గులాంనబీ ఆజాద్, ఆంటోని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు వయలార్ రవి, గతంలో రాష్ర్టంలో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించిన దిగ్విజయ్ సింగ్, సోనియా రాజకీ కార్యదర్శి అహ్మద్ పటేల్ తో కాంగ్రెస్ అధ్యక్షురాలు తెలంగాణపై చర్చించారు. సోనియా నివాసం జరిగిన ఈ భేటీలో ప్రధాని మన్మోహన్ సింగ్ మినహా మిగిలిన కోర్ కమిటీ నేతలంతా హాజరయ్యారు. కోల్ కతాలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ శతవార్షికోత్సవానికి హాజరయినందున మన్మోహన్ ఈ సమావేశానికి రాలేకపోయారు. ఈ భేటీతో తెలంగాణా అంశంపై క్రియాశీలంగానే ఉన్నామన్న సంకేతాలు కాంగ్రెస్ అధిష్టానం నుంచి వెలువడ్డాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ కోర్ కమిటీ ఈరోజు (శుక్రవారం) కూడా మరో దఫా భేటీ అయ్యే అవకాశం ఉందనీ, ఈ సమావేశానికి రాష్ర్టం నుంచి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీఎం కిరణ్ హాజరవుతారని సమాచారం.