వీళ్లూ.. ‘దీక్ష’ విరమించారు..!

tdpనిమ్స్ లో తెదేపా నేతలు దీక్ష విరమించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. గత నాలుగు రోజులుగా పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ లో దీక్షకు దిగిన నేతల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో.. శుక్రవారం అర్థరాత్రి దీక్షను భగ్నం చేసి పోలీసులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆరోగ్య కారణాల దృష్ట్యా దీక్ష విరమించాల్సిందిగా భువనేశ్వరి కోరడంతో… తెదేపా నేతలులు దీక్షను విరమించినట్లు తెలుస్తోంది.

అయితే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా దీక్ష విరమించాలని పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కోరారని తెదేపా సీనియర్ నేత ఎర్రబెల్లి తెలిపారు. దీంతో దీక్ష విరమించుకున్నామని ఆయన అన్నారు. ఇక విద్యుత్ ఉద్యమాన్ని రష్ర్టవ్యాప్తంగా ఉదృతం చేస్తామని.. దానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ ఈ రోజు సాయంత్రంలోగా ప్రకటిస్తామని ఎర్రబెల్లి వెల్లడించారు.

అంతకుముందు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా నేతలను సీపీఐ రాష్ర్ట కార్యదర్శి నారాయణ పరామర్శించారు. విద్యుత్ ఉద్యమంలో భాగంగా భవిష్యత్ కార్యాచరణపై తెదేపా ఏ ప్రకటన చేసినా క్షేత్రస్థాయిలో మద్ధతు ప్రకటిస్తామని ఆయన అన్నారు.