ఢిల్లీ బాట పట్టిన తెదేపా నేతలు!!

tdpతెదేపాకు చెందిన ఇరుప్రాంత నేతలు హస్తినా బాట పట్టారు. తెదేపా-’టీ’ నేతలు తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో పెట్టేవిధంగా ఒత్తిడి తెస్తామని అంటున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి, ప్రధాని మరియు కేంద్ర హోంశాఖ మంత్రి షిండే తో భేటీ అవుతామని తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అంతేకాకుండా.. వివిధ జాతీయ పార్టీల నేతలను కలసి టీ-బిల్లుకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తామని అంటున్నారు.

మరోవైపు, టీ-బిల్లును అడ్డుకోవడమే లక్ష్యంగా సీమాంధ్ర నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. వీరు కూడా రాష్ట్రపతి, ప్రధానిని కలవనున్నారు. రాష్ట్రం సమైక్యంగానే కొనసాగేలా కృషి చేస్తామని చెబుతున్నారు. మొత్తానికి తెలుగు తముళ్లు ఢిల్లీలో తమ తమ వాదనలు వినిపించడానికి రెడీ అయిపోయారు. కాగా, తెదేపా అధినేత చంద్రబాబు ఢిల్లీలో తిష్టవేసి వివిధ పార్టీ నేతలతో భేటీ అవుతూ బిజీగా వున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ కుట్రలను జాతీయ స్థాయిలో ఎండగట్టడమే లక్ష్యంగా బాబు ముందుకు కదులుతున్నారు.