సీతాకోక చిలుక.. గొంగళిపురుగుగా మారిందా..!

trs-kcr-and-KTRతెరాస అధినేత కేసీఆర్ కుటుంబంపై ప్రత్యర్థులు ముప్పేట దాడిని ముమ్మరం చేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో.. కేసీఆర్ కుటుంబ సభ్యులు “త్యాగాల సెంటిమెంట్ తో భోగాల సెటిల్ మెంట్ దందా” చేశారంటూ ఓ ప్రముఖ పత్రికలో ప్రచురితమైన కథనం రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా తెలంగాణ వాదులను ఉలిక్కిపడేలా చేసింది.

దాదాపు అరవై ఏళ్లకు పైబడిన నెరవేరని ఆశ అది… అసంఖ్యాక అమరుల ఆశయ స్వప్నమది… అనేక శ్రీకాంతాచారుల ఆహుతి ఫలితమది… ఆరని ‘జ్యోతు’లు అందించిన ఆసరాతో ప్రజ్వరిల్లుతున్న ఉద్వేగ ఉద్యమమది… అది తెలంగాణం. అంతటి మహోత్తరమైన చరిత్ర కలిగిన తెలంగాణ ఉద్యమానికి… ఆ ఉద్యమ నేతగా భావించే తెరాస అధినేత కేసీఆర్ తనయుడు, కుటుంబ సభ్యులు సెంటిమెంట్ తో.. సెటిల్ మెంట్ కు పాల్పడుతున్నారనే వార్తలు సాధారణ తెలంగాణ బిడ్డకు కు కూడా మింగుడుపడని విషయం.

అయితే, గత చాలా కాలం నుంచి.. తెరాస తెరాచాటు వసూళ్లు, దందాల గురించి ప్రత్యర్థులు ఎత్తిపొడుస్తూనే ఉన్నారు. తెరాస అంటే ఉద్యమ పార్టీ అని కొందరంటే.. తెరాస అంటేనే ‘కలెక్షన్ల పార్టీ’ అని మరికొందరు అంటున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా.. తెరాస అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యల ఆస్తుల పై న్యాయ విచారణ జపాలంటూ.. చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటుందని, మరోపక్క తెలంగాణ ప్యాకేజీ అంటూ.. కొందరు నేతలు ఫ్లకార్డ్స్ ను ప్రదర్శిస్తున్న సమయంలో.. తెలంగాణ ఉద్యమానికి ‘తామే, తాము
మాత్రమే ప్రతినిధులం’ అంటూ ప్రకటించుకున్న కొందరు నేతలు, త్యాగాల సెంటిమెంటును… భోగాల సెటిల్‌మెంటు కోసం మలచుకున్న మాయాజాలం వెలుగులోనికి వచ్చింది. అయితే, ఇక్కడ సగటు తెలంగాణ వాదికి వచ్చే ప్రశ్న
ఒక్కటి ఉంది. ప్యాకేజీ తెలంగాణకేనా.. లేక తెలంగాణ ఉద్యమాన్ని నడిపే నేతలకా..?. ఎందుకంటే గత అరవై ఏళ్లుగా నాయకులు తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని.. సొంత రాజకీయ లబ్దిపొందివారే… ఆనాడు చెన్నారెడ్డి నుండి.. నేటి కేసీఆర్ వరకూ.. అదే తంతు.

అయితే, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు భరించే ఓపికపోయింది. సెంటిమెంట్ ను సెటిల్ మెంట్ గా మార్చుకొనే ఏ రాజకీయ నాయకుడ్ని కూడా క్షమించే పరిస్థితుల్లో లేరు. అది కేసీఆర్ అయినా.. మరేనాయకుడైనా సరే. ప్రజలకున్న ఓటు ఆయుధం ద్వారానే ఈ సెటిల్ మెంట్ నేతలకు ప్రజలకు బుద్ధిచెప్పే కాలం ఎంతో దూరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ కోసం శరీరం కాలినా.. భరించే తెలంగాణ ప్రజలు శీలం లాంటి తెలంగాణ ఉద్యామాన్నే అవమానపరిస్తే మాత్రం నేతలు వారి ఆగ్రహానికి బలికావాల్సిందే. సెటిల్ మెంట్ నాయకులారా.. ఖబద్దార్..!