అసలు విషయమేటంటే.. నిన్న మొన్నటి వరకు సమైక్యాంధ్ర కోసం స్ట్రాంగ్ ప్రయత్నిస్తున్నామన్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు తాజాగా, విభజన విషయం పేర్కొన్న అంశాలపై అభిప్రాయాలను స్వీకరించే.. జీవోఎంకు నివేదిక అందజేశారు. నివేదికలో సీమాంధ్రకు కేటాయించవలసిన ప్యాకేజీపై కూడా స్పందించారు. దీంతో.. ఇన్ని రోజులు సమైక్యరాగం ఆలపించిన కేంద్ర మంత్రుల అసలురంగు బయటపడినట్లు అయింది. గతంలో పలువురు ఆరోపించినట్లుగా.. కాంగ్రెస్ అధిష్టానం విభజన నిర్ణయం తీసుకున్నప్పుడే.. ఆ విషయం కేంద్ర మంత్రులు, సీమాంధ్ర సీనియర్ లీడర్స్ తెలుసు అన్నది ఇప్పుడు నిజమని నిరూపితమయింది. ఏదో సీమాంధ్రలో ప్రజాందోళనలు చూసి వీరు నలుగురిలో.. నమో.. అన్నట్లుగా సమైక్యరాగం ఆలపించారు కానీ.. విభజన ఆగదని వారికి ఎప్పుడో తెలుసన్నది తాజా సంఘటనలతో తేటతెల్లమయింది అన్నమాట. అధిష్టానం ఆజ్ఞతో సమైక్యరాగం నుంచి ప్యాకేజీలంటూ.. కొత్త పల్లవైతే.. అందుకున్నారు గానీ.. మరి ప్రజల నుంచి వచ్చే సమరరాగాన్ని కేంద్ర మంత్రులు ఎలా అధిగమిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.