నేరచరితులు.. రాజకీయాలకు అనర్హులు !

supreem-courtరాజకీయాల్లో నేరచరితుల మనుగడపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును ఇచ్చింది. రాజకీయ నాయకులు నేరచరితులని తేలితే.. వారిపై అనర్హత వేటు తప్పదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం అవలంబిస్తున్న.. ప్రజాప్రతినిధులు అనర్హత వేటు నుంచి తప్పించుకునే వెసులుబాటును కల్పిస్తున్న నిబంధన సరికాదని, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో అనర్హత నుంచి తప్పించుకునే నిబంధన న్యాయ సమ్మతం కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అంతేకాకుండా.. అప్పీల్ పెండింగ్ లో ఉన్నంత వరకు ప్రజాప్రతినిధులు అర్హులే అనే నిబంధన తప్పని అభిప్రాయపడింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8(4) నిబంధన న్యాయసమ్మతం కాదని తెలిపింది. తీర్పు వెలువడక ముందే దోషులైన ప్రజాప్రతినిధులు అప్పీలుకు వెళితే అనర్హత వర్తించదని సుప్రీంకోర్టు తెలియజేసింది. క్రిమినల్ కేసుల్లో ప్రజాప్రతినిధులు దోషులుగా తేలితే ఎన్నికల్లో పోటీ నుంచి నిషేధించాల్సిందేనని పేర్కొంది. కాగా, తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనదేశంలో ఇలాంటి చట్టం తీసుకువస్తే మాత్రం ఇప్పుడు రాజకీయనాయకులలో అత్యధికులు అనర్హులుగా ప్రకటించబడతారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.