నేడే మోడీ ప్రమాణ స్వీకారం

MODIఇటీవల ఎన్నికల్ల్లో విజయదుందుభి మోగించిన నరేంద్ర మోడీ బుధవారం నాలుగోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ క్రీడాప్రాంగణంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి భారీ సన్నాహాలు జరిగాయి. భారీ పోలీస్ బలగాలతో విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భాజపా అగ్రనేతలు ఎల్.కె. అద్వానీ, సుష్మాస్వరాజ్, డా. మురళీ మనోహర్ జోషి, అరుణ్ జైట్లీ తదితర నేతలతో పాటు ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ పారికర్, అర్జున్ ముండా, రమణ్ సింగ్ లు తరలివస్తున్నారని సమాచారం. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా హాజరుకావచ్చని సమాచారం. మహారాష్ర్ట నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ థాకరే సతీసమేతంగా మోడీ ప్రమాణస్వీకారానికి విచ్చేయనున్నారని భాజపా వర్గాలు తెలిపాయి.

మంగళవారం గాంధీనగర్ లో నిర్వహించిన భాజపా ఎమ్మెల్యేల సమావేశంలో నరేంద్ర మోడీ ఆ పార్టీ శాసన సభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు ఆర్సీ ఫాల్డు నేతృత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్ కమలా బేణీవాల్ ను కలిసి మోడీ ఎన్నికకు సంబంధించి లేఖను అందజేశారు. మోడీ నాయకత్వంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలచినట్లు తెలిపారు.