తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ మరోసారి తన దొడ్డ మనసును చాటారు. బస్సు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడిన 19 ఏళ్ల ఒడిశా యువతిని శస్త్రచికిత్స కోసం నిమిషాల్లో స్పందించి ఆదుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. రశ్మిత అనే యువతి ఒడిశా నుంచి వచ్చి హైదరాబాద్లోని కాల్ హెల్త్ అనే సంస్థలో ఉద్యోగం చేస్తుంది. జీడిమెట్ల ప్రాంతంలో నిన్న ఉదయం బస్సులోంచి జారి పడి ప్రమాదానికి గురయ్యింది. వెంటనే ఆమెను సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆపరేషన్ కోసం కోసం రూ. 7 లక్షల వరకు అవుతుందని వైద్యులు చెప్పారు. ఆమెకు, ఆమె కుటుంబానికి అంత స్తోమత లేకపోవడంతో రాబిన్ అనే సహోద్యోగి ట్విటర్లో ఈ సమాచారాన్ని కేటీఆర్కు, ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు.
ఒడిశా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే తన కార్యక్రమాల్లో తలమునకలై ఉన్న కేటీఆర్ ఆ ట్వీట్ను చూసి స్పందించి ఆసుపత్రికి తమ సిబ్బందిని పంపించి, వెంటనే శస్త్రచికిత్స చేయాలని అదేశించారు. దీంతో ఆమెకు వెంటనే శస్త్రచికిత్స చేశారు. ఇప్పుడు ఆమె రస్మిత క్షేమంగా వుంది. ఈ ఘటనతో మరోసారి తన తన మానవత్వాన్ని , స్పందించే హృదయాన్ని చాటుకున్నారు కేటీఆర్.