ప్రదీప్ ట్వీట్ కి కెటీఆర్ రియాక్షన్


రంగారెడ్డి జిల్లా ఘ‌ట్‌కేస‌ర్ మండ‌లం చ‌ర్ల‌ప‌ల్లిలోని మండ‌ల ప‌రిష‌త్ ప్రాథ‌మిక పాఠ‌శాల దుస్థితిని గురించి వివ‌రిస్తూ యాంకర్ ప్ర‌దీప్ ఈ రోజు తెలంగాణ మంత్రి కేటీఆర్ కి ఓ ట్వీట్ చేశాడు. ఆ పాఠ‌శాల‌లో 120 మంది బాలికలు, 100 మంది బాలురు చదువుకుంటున్నారని, కానీ, ఒక్క బాత్రూమ్ కూడా లేదని వీ కేర్ ఎన్జీవో చేసిన ట్వీట్ ను ప్రదీప్ కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చాడు. అలాగే, ఆ పాఠశాలకు మంచి నీటి సౌకర్యం కూడా లేదని తెలిపాడు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పాడు.

ప్రదీప్ చేసిన వినతికి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఆ పాఠశాల విద్యార్థుల సమస్యలను తప్పకుండా తీర్చుతామని ట్వీట్ చేసి హామీ ఇచ్చారు. మేడ్చల్ కలెక్టర్ ఈ విషయంపై వెంటనే స్పందించాలని, సమస్యను పరిష్కరించి, ఆ విషయాన్ని మళ్లీ తనకు తెలియజేయాలని ఆదేశించారు.