విజయమ్మతో కోదండరాం భేటీ

vijayamma-kodandaramవైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో ఐకాస ఛైర్మన్ కోదండరాంతో పాటు పలువురు ఐకాస నేతలు భేటి అయ్యారు. ఈ నెల 28వ జరిగనున్న అఖిలపక్ష సమావేశంలో వైకాపా తరపున ఒకే అభిప్రాయం చెప్పాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై వైయస్ విజయమ్మకు తాము చెప్పాల్సింది చెప్పామని, ఆలోచిస్తామని చెప్పారని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతినిధులు ఈ నెల 28వ తేదీన అఖిలపక్ష సమావేశంలో చెప్పే వైఖరిని బట్టే తమ ప్రతిస్పందన ఉంటుందని ఆయన అన్నారు. అదేవిధంగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చెప్పని పార్టీలను నిలదీస్తామని ఆయన విజయమ్మతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ జెఎసి నాయకులు ఇంతకు ముందు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కూడా జెసి నాయకులు కలవనున్నట్లు సమాచారం.