పాస్ పుస్తకానికి ఆధార్ అనుసంధానం: కేసీఆర్

ఎటువంటి పొరపాట్లు లేకుండా కొత్త పాస్ పుస్తకాలను పట్టాదారులకు అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కొత్త పాస్ పుస్తకాల పంపిణీపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. కొత్త పాస్ పుస్తకాల పంపిణీపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

పాస్ పుస్తకానికి తప్పకుండా ఆధార్ అనుసంధానం చేయాలని, లేకుంటే ఆ భూములను బినామీ ఆస్తులుగా గుర్తించే అవకాశం ఉందన్నారు. అలాగే అసైన్డ్ భూములున్న వారికి కూడా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందివ్వాలని, అసలు లబ్ధిదారుల స్వాధీనంలో ఉన్న భూములను కూడా గుర్తించాలని సీఎం ఆదేశించారు. మార్చి 11నే పాస్ పుస్తకాలన్నీ పంపిణీ చేసి తీరాలనే తొందరలో పొరపాట్లు జరగడానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వవద్దన్నారు.