ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కల్పించిన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న పరస్పర విరుద్ధ ప్రకటనల వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడడంతో వాస్తవాలను ధ్రువీకరించడానికి ఏర్పాటైన జేఎఫ్సీ సమావేశాన్ని రేపు హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు దసపల్లా హోటల్లో ప్రారంభం కానుందని ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ సమావేశం ఎల్లుండి కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. రేపు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి, అంజలి ఘటించి పవన్ కల్యాణ్ జేఎఫ్సీ సమావేశానికి వెళతారని అందులో పేర్కొన్నారు.
రెండు రోజులపాటు కొనసాగే ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్తోపాటు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొననున్నారు.