” మా భవిష్యత్తును డిల్లీ లో కూర్చున్న కాంగ్రెస్ నాయకులు నిర్దెశిస్తారా ” అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్న ఆందోళనకారులకు ఆంటోని కమిటి ఏర్పాటు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈ కమిటీలో మన రాష్ట్రానికి చెందిన ప్రాతినిధ్యం లేకపోవటమే కాక, ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు వుండటం తెలుగువారిని అవమానించటమేనని. ఇది తమ ఆత్మగౌరవాన్ని కించపరచటమేనని అన్ని ప్రాంతాలకు చెందిన తెలుగువారు భావిస్తున్నారు. ఏ కేంద్రప్రభుత్వ కమిటీయో, లేక అన్ని ప్రాంతాల ప్రాతినిధ్యంతో కూడిన కమిటీయో , అదీకాకపోతే ఏ జ్యుడిషియరి కమిటీయో అయితే అందరూ వెళ్లి తమ అభిప్రాయాలను, సమస్యలను ఆ కమిటికి వివరించేవారని, అలాకాకుండా ఒక పార్టీ కి చెందిన కమిటీ ముందు తమ గోడు వెళ్ళబొసుకునే ఖర్మ తమకు ఏమిటని ఇరు ప్రాంతాల వారి అభిప్రాయంగా కనపడుతోంది. ఇప్పటికే ఈ విషయమై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఆంటోని కమిటీ ముందుకు వెళ్లి తాము మోకాళ్ళమీద సాగిలపడలేమని, ఇది యావత్ రాష్ట్ర ప్రజలను అవహేళన చేయటమేనని అన్నారు. ఇతర పార్టీలు, సంఘాలు కూడా చంద్రబాబు వాదనతో ఏకీభవిస్తుండటం విశేషం. ఇదిలావుండగా మైకులు కనిపిస్తే పూటకో రకంగా మాట్లాడే దిగ్గిరాజా మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోకుండా వినోదాన్ని చూస్తున్నారన్న విమర్శ సర్వత్రా వినపడుతోంది.