విభజనను అడ్డుకునేందుకు అన్ని విధాల అవకాశాలున్నది ఒక్క భాజాపాకే. కానీ, ఆది నుంచి తెలంగాణకు కట్టుబడి వున్న భాజాపా యూటర్న్ తీసుకునే అవకాశాలే లేవంటున్నారు విశ్లేషకులు. పైగా, సమైక్యం కోసం సహకరించాల్సిందిగా నిన్న
వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కలసినప్పటికి కూడా పెద్దగా ఫలితం లేకపోయింది. తెలంగాణకు కట్టుబడివున్నామని రాజ్ నాథ్ మరోసారి స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలుగా వున్న తెదేపా, వైకాపాలలో.. తెదేపా ఇప్పటికే విభజనకు అనుకూలమంటూనే ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇక వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒక్కటే అడుగుతున్నా.. ఒక్కటే అడుగుతున్నా.. అంటూ సీమాంధ్ర సీఎం కుర్చి అడుగుతున్నట్లుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. రాష్ట్ర విభజన జరిగితేనే రాజకీయంగా లబ్ధిపొందవచ్చునని అంతర్గతంగా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
మరి అన్ని విధాల అనుకూలంగా వున్న విభజనకు అడ్డుగా నిలిచేది ఏమిటి..? అంటే. ఇక మిగిలింది రాష్ట్ర విభనకు వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో సమైక్య వాదులు దాఖలు చేసిన ఒకట్రెండు సమైక్య పిటిషన్లు మాత్రమేనని రాజకీయ పండుతుల వాదన. అందులో తెదేపా నుంచి పయ్యావుల కేశవ్, సీఎం రమేష్ లు విడివిడిగా పిటిషన్లు వేశారు. వైకాపా నుంచి డి.ఎ.సోమయాజులు మరో పిటిషన్ ను దాఖలు చేశారు. ఇవేగాక విభజనను సమాల్ చేస్తూ.. మరో ఆరు పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయి. శాసనసభ అభిప్రాయం తెలుసుకోకుండా, ఏకపక్షంగా కేంద్రం రాష్ట్రాన్ని విభజించాలని చూస్తుందని.. ప్రజాభిష్టం మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాలన్నది వీటన్నింటి సారాంశం. సుప్రీంలో దాఖలైన సమైక్య పిటిషన్లపై ఈరోజు (సోమవారం) విచారణ జరగనుంది. సమైక్యవాదులు తమ చివరి ఆశగా పరిగణిస్తున్న ఈ సమైక్య పిటిషన్లు ఎంత వరకు విభజనను ఆపగలవు.. ? కేంద్ర నిర్ణయాన్ని ఆపక్షేపించి విభజనను మరింత జాప్యం చేయగలవా.. ? అన్నది ఇప్పుడు అందరిని తొలుస్తున్న పశ్న. అయితే, కేంద్రం తీసుకున్న విభజన నిర్ణయంలో సుప్రీం జోక్యం చేసుకోకపోవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల భావన.