ఇక మహానాడులో మరో కొత్త విశేషం లోకేష్ రావడం. మినీ మహానాడుల్లో అధికారికంగా పాల్గొన్న లోకేష్ , ఈ మహానాడుతో రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లే. అయితే వీలయినంత హడావుడి లేకుండా చూడడంలో ఇటు పార్టీ, అటు బాబు ద్వయం జాగ్రత్తపడ్డారు. అది కాస్త మెచ్చుకోదగ్గ విషయం.
చిరకాలంగా ఎడమొహంగా వుంటూ వస్తున్న హరికృష్ణ ఈ మహానాడులోనూ అదే తరహా ప్రదర్శించారు. అంటీముంట్టనట్లు, ముళ్లమీద వున్నట్లు వుండి, అంతలోనే మాయమయ్యారు. ఇది కార్యకర్తలకు ఏ విధమైన సంకేతాలు ఇస్తుందన్నది కొత్తగా ఆలోచించాల్సిన పనిలేదు. ఎందుకంటే బావా బామ్మర్థులకు పొసగని విషయం ఇప్పటికే జనాల్లోకి వెళ్లాల్సినంతా వెళ్లిపోయిందనే చెప్పాలి. అందువల్ల ఇప్పుడు కొత్తగా వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ జూనియర్ రాకపోవడం అన్నది కొంచెం మైనస్సే అని చెప్పాలి. ఇక్కడ బాబు కొంచెం పట్టు విడుపు ధోరణి ప్రదర్శించాల్సింది. ఎంతయినా పార్ఠీకి జూనియర్ ఇమేజ్ ప్లస్ అవుతుందన్నది వాస్తవం. పైగా పవన్ చంద్రబాబును కలిసినట్లు ఇటీవల ఫీలర్లు వచ్చాయి. అవి సహజంగా జూనియర్ అభిమానులను బాధిస్తాయి. అందువల్ల బాబు జూనియర్ ను స్వయంగా ఆహ్వనించి వుంటే ఆయన పట్ల గౌరవం పెరిగేది. ఇక రెండవ రోజయినా కార్యకర్తలకు ఉత్తాహాన్నిచ్చే విధంగా మహానాడు సాగుతందేమో చూడాలి మరి.