ఇంతకు విభజన విషయంలో సీమాంధ్ర నేతల అసంతృప్తికి అసలు కారణం రాజధాని హైదరాబాద్ అనే విషయం అందరికి తెలిసిందే. పది సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. పది సంవత్సరాలు హైదరాబాద్ ఏ రాష్ట్రం పరిధిలో ఉంటుంది. నగర శాంతిభద్రతల పరిస్థితి ఏమిటి..? తదితర అంశాలు ప్రతి సామాన్య పౌరునికి వచ్చే సందేహాలు. ఆది నుంచి హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా పేర్కొంటూ వస్తోన్న.. దిగ్విజయ్ ఆదివారం టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నగరంపై పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. వచ్చే పది సంవత్సరాలపాటు హైదరాబాద్ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికినీ.. అది తెలంగాణలో రాష్ట్ర పరిధిలోనే ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ కు శాంతిభద్రతల అంశాన్ని మాత్రం ఢిల్లీ తరహాలో కేంద్రానికి అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. అంటే.. ఈ పది సంవత్సరాలు హైదరాబాద్ కేంద్రం కనుసనుల్లోనే మెలగనుందన్న మాట.
ఉమ్మడి రాజధాని సరే.. మరీ పదేళ్ల పాటు నగర ఆదాయం ఏ రాష్ట్రానికి చెందుతుంది అనే విషయాన్ని దిగ్గీరాజా స్పష్టం చేయలేదు. భాగ్యనగరంపై కేంద్రం పదేళ్లపాటు పెత్తనం సాగించనుందని దిగ్గీరాజా మాటలను బట్టి అర్థమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరీ ఈలోపు సీమాంధ్రలో కొత్త రాజధానిని నిర్మించుకోవాలని కూడా ఆయన సూచించారు. మరీ పది సంవత్సరాల్లో కొత్త రాజధాని నిర్మాణం పూర్తి కాని యెడల పరిస్థితి ఏమిటి? అప్పుడు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తారా..? మొత్తమ్మీద ఏదో ఓ కారణంతో హైదరాబాద్ నగరాన్ని కేంద్రం తన చేతిలో ఉంచుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇక భాగ్యనగరం భవితవ్యం హస్తిన హస్తంలో ఉండబోతుందన్నమాట!