కిరణ్ ను బర్తరఫ్ చేయండి !

erraమంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పు పై ఇరు ప్రాంతాల్లో అభిన్నాభిప్రాయలు వినిపిస్తున్నాయి. తెలుగు దేశం సీమాంద్ర నేతలు శ్రీధర్ బాబు శాఖ మార్పును రాజకీయ కోణంలో చూడరాదని వ్యాఖ్యానిస్తుంటే, తెలుగు దేశం పార్టీ తెలంగాణ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకరరావు మాత్రం ఈ అంశం పై ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి కిరణ్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన టీడీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణను తమ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ నాటకాలాడుతోందని విమర్శించారు. రాష్ట్రపతి పంపిన బిల్లును కాంగ్రెస్ పార్టీ నవ్వుల పాలు చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎలాంటి వ్యూహాలు పన్నినా, ఎమ్మెల్యేలు నాటకాలు ఆడినా… పార్లమెంటులో బిల్లును పాస్ చేస్తామని ప్రధాని ప్రకటించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.