కేసీఆర్ పై ఎర్రబెల్లి ఫైర్ !

errabelli-fire-on-kcrతెరాస అధినేత కేసీఆర్ పై తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ లో ఎర్రబెల్లి ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ… బయ్యారం, ఓబుళాపురం గనులు, పోలవరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు పెద్దఎత్తున ముడుపులు ముట్టాయని ఆరోపించారు. వీటికి సంబంధించి ఆధారాలున్నాయన్న ఎర్రబెల్లి.. కేసీఆర్ చర్చకు వస్తే నిరూపించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. “బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు” అంటున్న కేసీఆర్ గతంలో బయ్యారం గనుల విషయంలో ఒక్కరోజు పోరాటం చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎర్రబెల్లి ప్రకటించారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే గనులపై తెరాస డ్రామా ఆడుతోందని ఆయన మండిపడ్డారు. తెరాసకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీఎం ముందు, పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బయ్యారం గనులు తెలంగాణ సొంతమని, ఇక్కడి ఇనుప ఖనిజాన్ని విశాఖ స్టీల్ కు తరలించడాన్ని అడ్డుకుని తీరుతామని ఎర్రబెల్లి ప్రకటించారు. కాగా, తెలంగాణ ప్రాంత నేతల ఆందోళనలతో… ప్రభుత్వం బయ్యారం స్టీల్స్ ను విశాఖకు తరలించకుండా బయ్యారంలోనే ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు జరుతుంది. ఈ నేపథ్యంలో.. తెరాస, తెదేపాలు రాజకీయ లబ్ధికోసమే బయ్యారం విషయంలో.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.