హైదరాబాదులో పుట్టి, పెరిగి, ఇక్కడి వీధుల్లో తిరిగినవాడినని కిరణ్ చెప్పుకొచ్చారు. ఆంధ్రాకు వేరుగా క్రికెట్ జట్టు ఉన్నా.. తాను హైదరాబాదు తరఫునే క్రికెట్ ఆడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిజాం కాలేజీ జట్టు కెప్టెన్ గా, హైదరాబాదు జట్టు కెప్టెన్ గా క్రికెట్ ఆడానని కిరణ్ తెలిపారు. తనకు తెలంగాణలో ఇప్పటికీ పలువురు మిత్రులున్నారని సీఎం చెప్పారు.
హైదరాబాదుకు నిధులు ఖర్చు చేసినప్పుడు.. ఎందుకు ఖర్చు చేశారని ఎవరూ అడగలేదని… ఎందుకంటే హైదరాబాదు అంటే అందరిదీ అని.. ఈ భావం అందరిలో ఉందని కిరణ్ పేర్కొన్నారు. హైదరాబాదులో అవసరమైన అన్ని ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు ఉన్నాయని ఆయన అన్నారు. అన్ని రంగాల్లో హైదరాబాదు నగరం అభివృద్ధి చెందిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. అలాంటప్పుడు, హైదరాబాదును వీడి వెళ్ళమంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఆయన అన్నారు. అలాగే, తెలంగాణ ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రజలకు కూడా కష్టనష్టాలు ఉంటాయని తెలిపారు. కిరణ్ ప్రసంగం ఇంకా కొనసాగుతోంది.