మోడీతో సమావేశమనంతరం చంద్రబాబు భాజాపా అగ్రనేత అద్వానీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ తో విడివిడిగా సమావేశమయి మంతనాలు జరిపారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తెదేపా భాజాపాతో జతకట్టనుంది అనే వార్తల నేపథ్యంలో.. తాజా భేటీలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే, ఇప్పటికే తెదేపా-భాజాపాల మధ్య పొత్తు ఖరారైందని, త్వరలోనే చంద్రబాబును ఎన్డీయే కన్వీనర్ గా కూడా నియమించబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
హైదరాబాద్ లో బహిరంగ సభకు వచ్చిన మోడీ.. తెదేపా జపం చేసినప్పటి నుంచీ.. ఈ రెండు పార్టీల మధ్య బంధం బలపడుతూ వచ్చింది. తదనంతరం చంద్రబాబు, మోడీ కలసి ఢిల్లీలో ఓ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో.. తెదేపా-భాజాపా మరోసారి జతకట్టనున్నాయని ఆయా పార్టీల కార్యకర్తలే అంగీకరిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణకు గట్టిగా మద్ధతు పలుపుకుతున్న భాజాపాతో తెదేపా పొత్తు కుదురుతుందా.. ? లేదా.. ? అన్న దానిపై స్పష్టత రావాలంటే.. మరికొంత కాలం ఆగాల్సిందే మరీ.. !