Site icon TeluguMirchi.com

వందేభారత్ రైళ్లు ఇక ప్రైవేటు‌పరం.. కేంద్రం సంచలన నిర్ణయం


దేశవ్యాప్తంగా ఇటీవలే పట్టాలెక్కిన అత్యాధునిక వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఏపీ-తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఈ రైళ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు 10 రైళ్లు వేర్వేరు రాష్ట్రాల్లో వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోన్నాయి. ఇతర ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ల రేట్లు రెట్టింపు అయినప్పటికీ ప్రయాణికులు పెద్దగా పట్టించుకోవట్లేదు. సమయం, వేగానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు.

ఇక వందేభారత్ రైళ్లకు లభిస్తున్న ఆదరణ, పెరుగుతున్న ఆక్సుపెన్సీ రేటు, డిమాండ్ దృష్టిలో ఉంచుకుని దేశంలో కొత్తగా 400 వందేభారత్ రైళ్ల తయారీకు ప్రభుత్వం సిద్ధమైంది. కోచ్‌ల తయారీ, నిర్వహణను ప్రైవేట్‌పరం చేసేందుకు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగా బిడ్స్ ఆహ్వానించింది. దేశీయ, విదేశీ కంపెనీలు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ)ని జారీ చేశాయి. ఈ 400 రైళ్లల్లో సగం స్లీపర్ క్లాస్ కు చెందినవే. మిగిలిన 200.. చైర్ కార్ సర్వీసులు. స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లు గరిష్ఠంగా 200 నుంచి 220 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసేలా తీర్చిదిద్దే అవకాశం ఉంది.

ప్రస్తుతం చెన్నైలో రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ కోచ్ లు తయారవుతున్నాయి. ఇప్పుడు ఈ బాధ్యతల నుంచి ఐసీఎఫ్ ను తప్పించనుంది కేంద్రం. కొత్త కోచ్ ల తయారీ, వాటి నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించనుంది. దీనికోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియను కూడా చేపట్టింది. దీనికోసం ఫ్రాన్స్‌కు చెందిన అల్ స్టోమ్ కన్సార్టియం, భారత్-స్విట్జర్లాండ్ సంస్థ మేధా-స్టాడ్లర్ రైల్ కన్సార్టియం బిడ్స్ దాఖలు చేశాయి. 35 ఏళ్ల పాటు వందేభారత్ రైళ్లకు అవసరమైన అల్యూమినియం కోచ్‌లను ఈ కన్సార్టియం తయారు చేస్తుంది. అలాగే వాటి నిర్వహణ బాధ్యతలను కూడా ఈ కన్సార్టియమే చూసుకుంటుంది. ఈ కాంట్రాక్ట్ విలువ 30 వేల కోట్లు. బిడ్స్ దాఖలు చేసేందుకు 45 రోజులు గడువుంది. ఇకపోతే వందే భారత్‌ కోచ్ ల తయారీని ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేయడం పట్ల వ్యతిరేకత ఎదురవుతోంది.

Exit mobile version