వైకాపా దీక్ష వీధి నాటకం..!

Botsa-Satyanarayana1సమైక్యాంధ్ర కోసం వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేస్తున్న దీక్ష వీధి నాటకాన్ని తలపిస్తోందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈరోజు గాంధీ భవన్ లో బొత్స విలేకరులతో మాట్లాడుతూ… అఖిల పక్ష సమావేశంలో రాష్ట్ర విభజనపై తెదేపా, వైకాపాలు సానుకూలంగా మాట్లాడటంతోనే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని చెప్పుకొచ్చారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే ఆయా పార్టీ నేతలు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని బొత్స ఆరోపించారు. 2008లో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు.. అప్పుడు ప్రజా అభిప్రాయాలు అడగలేదా అని బొత్స ప్రశ్నించారు. సున్నితమైన అంశంపై ఇప్పుడు ప్రజా అభిప్రాయమంటూ.. యాత్రల పేరిట గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని బొత్స మండిపడ్డారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ చూస్తోందని, అన్ని పార్టీలు అభిప్రాయం చెప్పాకే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని బొత్స స్పష్టం చేశారు.