నాయకులే వీడారు… కార్యకర్తలు కాదు : బాబు

NCBNతెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ఆస్త అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో..  ఈరోజు కొంపల్లి ఎక్స్ లెన్సీ గార్డెన్స్ లో జరుగుతున్న తెదేపా ప్రాంతీయ సదస్సులో బాబు మాట్లాడుతూ.. అధికారం కోసం కొందరు నాయకులు పార్టీని వీడినా.. ఒక్క కార్యకర్త కూడా పార్టీ నుంచి బయటికి వెళ్లలేదని అన్నారు. తెదేపా కార్యకర్తలు నీతినిజాయతీలకు మారుపేరని..  కార్యకర్తలు తన కుటుంబ సభ్యల్లాంటి వారని, వారు తనకు ప్రాణసమానమని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రాంతీయ సదస్సు సాక్షిగా.. బాబు తెరాసతో పాటు ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.  కేసీఆర్ కేంద్రమంత్రిగా వ్యవహరించిన సమయంలో..  ఇక్కడివారికి ఒరిగిందేమీలేదని,  బీడీకట్టలపై పుర్రె బొమ్మ ముద్రించడం ద్వారా రాష్ట్రంలోని వేలాది బీడీ కార్మికుల పొట్టగొట్టారని బాబు దుయ్యబట్టారు. హైదరాబాద్ లో వైఎస్ హయాంలో  వేలాది ఎకరాలు కొల్లగొడుతుంటే తెరాస ఒక్కమాటా మాట్లాడలేదని బాబు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలలో గెలుపొందేందుకు కార్యకర్తలు కృషి చేయాలని బాబు సూచించారు.