రాబోయే ఎన్నికలలో సమైక్యాంధ్ర ను బలంగా కోరుకునే నాయకుడికే అందరూ వోటు వెయ్యాలనీ,అటువంటి పార్టీ కే అధికారం కట్టబెట్టాలని, రానున్న ఎన్నికలలో ఉద్యోగులకు, ఉద్యోగసంఘాల నాయకులకు అధికశాతం సీట్లు కేటాయించాలంటూ అశోక్ బాబు చేస్తున్న ప్రసంగాలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికల గురించి, పార్టీల గురించి మాట్లాడాల్సిన అవసరాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడో ఆరునెలల తరువాత జరగబోయే ఎన్నికల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడు తున్నారని, ఇది పూర్తిగా అప్రస్తుత ప్రసంగమని వారు విమర్శిస్తున్నారు. తాను రాజకీయాలలోకి వచ్చే ప్రసక్తే లేదని, తమ సభలకు రాజకీయ నాయకులను అనుమతించబోమని పలు సార్లు చెప్పిన అశోక్ బాబు ఎందువల్ల ఇలా అకస్మాత్తుగా రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహనరెడ్డి మాత్రమే సమైక్యాంధ్ర కు తమ మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబునాయుడు రెండు ప్రాంతాలకు సమన్యాయం అనే జెండా భుజాన వేసుకున్నారు.
అంటే అశోక్ బాబు కిరణ్ కు వోటు వేయమంటున్నారా ? లేక జగన్ కు పట్టం కట్టమంటున్నారా ? అన్నది ప్రస్తుతం సమాధానం దొరకాల్సిన ప్రశ్నగా మిగిలిపోతోంది. ఇప్పటికే అశోక్ బాబు వెనుక కిరణ్ కుమార్ వుండి నడిపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపధ్యంలో ఒక ఉద్యమ నాయకుడిగా అశోక్ బాబు మరింత జాగ్రత్తగా తన ప్రసంగాలను రూపొందించుకోవలసిన అవసరం ఎంతైనా వుందనేది నిజం. అప్పుడే ఆయన నిజమైన నాయకుడిగా నిలిచిపోతారు.