దిగ్విజయ్ సింగ్ పరస్పర విరుద్ధ ప్రకటనలతో ఆంటోని కమిటి అస్తిత్వం, నిజాయితీ లపై సర్వత్రా సందేహాలు నెలకొన్నాయి. ఇది కేవలం సీమాంధ్ర ప్రాంత ప్రజల కంటి తుడుపు కోసం మాత్రమే నెలకొల్పారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. దీనికి తగ్గట్టుగా తాజాగా బొత్స మాట్లాడుతూ ” ఆంటోని కమిటీ కి విభజన ప్రక్రియకు సంబంధం లేదు. దేని దారి దానిదే… కేవలం సీమాంధ్రుల సమస్యలు తెలుసుకునేందుకే ఆంటోని కమిటి” అంటూ కొత్త రహస్యాన్ని బైట పెట్టారు. ” అన్నారు. దీంతో ఆంటోని కమిటీ ఏర్పాటు కేవలం సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికే అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.
ఇదిలావుండగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎంపిలు ఆంటోని కమిటి ముందు హాజరయి విభజన అంశాన్ని పునఃపరిశీలించవలసిందిగా అందుకు ఆంటోని నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్టు తెలిసింది. ” విభజన నిర్ణయాన్ని మళ్లీ ఆలోచించే ప్రసక్తే లేదు. అది అయిపోయిన ముచ్చట. దాని తాలూకు రాజ్యాంగ ప్రక్రియ జరిగిపోతోంది. ఆ విషయం కాకుండా ఇంకేదైనా చెప్పండి” అని ఆంటోని నిష్కర్షగా చెప్పినట్టు సమాచారం. నిర్ణయం జరిగిపోయి, ఇక చేసేదేమీ లేనప్పుడు ఈ ఆంటోని కమిటి దేనికి ? ఈ మీటింగులు దేనికి? కమిటీకి సంబంధించి ఈ బిల్డప్పులు ఎందుకు ? అన్న ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు?