నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా.. టీమిండియా ‘హ్యాట్రిక్’ విజయాలకు బ్రేకులేసింది. రసవత్తర మలుపులు తిరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. ఆగి… ఆగి… సాగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. 28 ఓవర్లలో 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 25.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. క్లాసెన్ (46), మిల్లర్ (39), విజయంలో కీలక పాత్ర పోషించారు.
అంతకుముందు భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 289 పరుగులు చేసింది. వందో వన్డే ఆడుతూ శిఖర్ ధావన్ సెంచరీ (109), కెప్టెన్ విరాట్ కోహ్లి (75) మరోసారి చక్కటి బ్యాటింగ్తో అలరించాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్కు 158 పరుగులు జోడించారు. సిరీస్లో ఐదో వన్డే మంగళవారం పోర్ట్ ఎలిజబెత్లో జరుగుతుంది. ఆరు వన్డేల సిరీస్లో ప్రస్తుతం భారత్ 3–1తో ఆధిక్యంలో ఉంది.